న్యూఢిల్లీ: అత్యాధునిక 118 అర్జున్ Mk-1A ట్యాంకులకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ఇచ్చింది. రూ. 7,523 కోట్ల వ్యయంతో వీటిని సమకూర్చుకోనున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని అవడి భారీ వాహనాల ఫ్యాక్టరీ (HVF)తో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం ఒప్పందం కుదుర్చుకున్నది. ‘రూ. 7,523 కోట్ల విలువైన ఈ ఆర్డర్, రక్షణ రంగంలో ” మేక్ ఇన్ ఇండియా ” కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ” ఆత్మనిర్భర్ భారత్ ” సాధించే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఈ ఒప్పందంలో భాగంగా తొలుత ఐదు అర్జున్ Mk-1A ట్యాంకులు 30 నెలలలోపు ఆర్మీకి సరఫరా అవుతాయి. అనంతరం ప్రతి ఏటా 30 ట్యాంకుల చొప్పున అందుబాటులోకి వస్తాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చెన్నైకి చెందిన కంబాట్ వెహికల్స్ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (CVRDE) అర్జున్ Mk-1A ట్యాంక్ను రూపొందించింది. 72 కొత్త ఫీచర్లు, స్వదేశీ సాంకేతికతో అర్జున్ ట్యాంక్ కొత్త వేరియంట్ను అభివృద్ధి చేసింది.