కోల్కతా, మార్చి 13: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్ ప్రజలకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికయిత్ పిలుపునిచ్చారు. శనివారం కోల్కతా, నందిగ్రామ్లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్లలో (బహిరంగ సభ) ఆయన మాట్లాడారు. బీజేపీని ఓడించే అభ్యర్థులకే ఓటు వేయాలని తన మద్దతుదారులను కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేసే విధంగా బీజేపీపై ఇది ఒత్తిడిని పెంచుతుందని పేర్కొన్నారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే మీ భూములను బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుంది. దేశాన్ని పారిశ్రామికవేత్తలకు అప్పగించి మీ జీవితాలను ప్రమాదంలోకి నెడుతుంది’ అని పేర్కొన్నారు. బీజేపీని అబద్ధాల పార్టీగా అభివర్ణించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయించింది. అందులో భాగంగానే బెంగాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేశారు. సభలో మేధాపాట్కర్ కూడా పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన ఘటన ప్రమాదవశాత్తు చోటుచేసుకుందని, అది ఆమెపై పథకం ప్రకారం జరిగిన దాడి కాదని ఇద్దరు ఎన్నికల పరిశీలకులు తేల్చారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు వారు శనివారం నివేదిక సమర్పించారు. బుధవారం నందిగ్రామ్లో జరిగిన ఘటనలో మమత గాయపడ్డారు. ఆమెపై బీజేపీయే దాడి చేయించిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.