హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కృష్ణానది నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా జలాల తరలింపును అడ్డుకోవాలని కృష్ణాబోర్డు చైర్మన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్ సోమవారం కృష్ణాబోర్డు చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్కు లేఖరాశారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శికి సైతం పంపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలుచేసేలా కృష్ణా బోర్డును ఆదేశించాలని లేఖలో కోరారు. కేఆర్ఎంబీ చైర్మన్ను ఉద్దేశిస్తూ ప్రభుత్వం రాసినలేఖలో పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి..
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రాకుండా నిర్మాణ పనులు చేపట్టవవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ-సౌత్జోన్) 29.10.2020నాడు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలిసిందే. ఆ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కనపెట్టి ఎత్తిపోతల నిర్మాణాలను వేగంగా కొనసాగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో మిసిలేనియస్ అప్లికేషన్ను 14.12.2020 నాడు దాఖలుచేస్తూ నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశాలివ్వాలని కోరింది. దీనిని పరిశీలించిన ఎన్జీటీ 24.02.2021నాడు ఆదేశాలిస్తూ..‘తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలి. ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణ పనులను కొనసాగించినట్టుగా గుర్తిస్తే చట్టపరం గా ఏపీపై చర్యలు తీసుకునే అధికారం, స్వేచ్చ బోర్డుకు ఉంది’ అని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
‘ఈ పథకానికి సంబంధించి పూర్తి సమగ్రనివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు ప్రాథమిక అన్వేషణ పనులు చేస్తున్నాం, ప్రధాన పనులు చేయడం లేదు’ అంటూ ఎన్జీటీకి ఏపీ సీఎస్ తెలిపారు. ఈ సమాచారాన్ని నమ్ముతున్నామని, అయినప్పటికీ కేఆర్ఎంబీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసి పనుల విషయంలో ఏం జరుగుతుందో చూసిరావాలని, ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణ జరిగినట్టుగా తేలితే తగిన చర్యలు తీసుకోవచ్చని ఎన్జీటీ స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిజనిర్ధారణ కమిటీతో పరిశీలన జరపాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (సాధారణ) రెండుసార్లు (20.3.2021,9.6.2021తేదీల్లో ) కేఆర్ఎంబీకి లేఖలు రాశారు. అయినా స్పందన లేకపోవడంతో ఎన్జీటీ ఆదేశాల అమలులో కేఆర్బీఎం స్పష్టంగా వైఫల్యం చెందినట్టుగా భావించాల్సి వస్తున్నది. మరోపక్క ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్మాణ పనులను చాలా వేగంగా చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం మాకు ఉన్నది. లేఖతోపాటు పంపిస్తున్న నిర్మాణ పనులను తెలియజేసే ఫొటోలు చూస్తే ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్టు అర్థమవుతుంది. వీటిని చూస్తే.. డీపీఆర్ తయారుచేయడానికి ప్రాథమిక పనులు చేస్తున్నట్టు కనపడదు. ట్రిబ్యునల్ ఆదేశాలమేరకు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా కేఆర్ఎంబీ ఏర్పాటుచేసిన దాఖలాలు లేవని అర్థమవుతున్నది.
ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ పనులపై ఈ నెల 19న భేటీలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ, చట్టవిరుద్ధమైన పనులను ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణకు చట్టబద్ధంగా కృష్ణాజలాల్లో దక్కాల్సిన హక్కులను కాపాడాలని కోరుతున్నాం’అని కేఆర్ఎంబీ చైర్మన్కు రాసిన లేఖలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ కోరారు.
రాయలసీమ ఎత్తిపోతలకు డీపీఆర్ కోసం ప్రాథమిక అన్వేషణ పనులు చేస్తున్నామని, ప్రధాన పనులు చేయడం లేదని ఎన్జీటీకి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఇప్పుడేమో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. కృష్ణాబోర్డు నిజనిర్ధారణ కమిటీ వేసి
పరిశీలించాలన్న ఎన్జీటీ ఆదేశాలను ఎందుకు పాటించరు? పర్యావరణ అనుమతులు రాకుండా పనులు చేపట్టవవద్దని ఎన్జీటీ చెప్పినా, స్పందించకుండా కృష్ణా బోర్డు ఆ
ఆదేశాల అమలులో స్పష్టంగా వైఫల్యం చెందినట్టుగా భావించాల్సి వస్తున్నది. ఇప్పటికైనా తెలంగాణ హక్కులను కాపాడేందుకు అక్రమ, చట్టవిరుద్ధమైన రాయలసీమ ప్రాజెక్టు
పనులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలి.
–కృష్ణాబోర్డుకు రాసిన లేఖలో ప్రభుత్వం