గుజరాత్లో ఇద్దరు వైద్యుల అంకితభావం
అహ్మదాబాద్, ఏప్రిల్ 18: మాతృమూర్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నా గుజరాత్కు చెందిన ఆ ఇద్దరు వైద్యులు కర్తవ్యాన్ని వీడలేదు. అమ్మల అంత్యక్రియలు పూర్తి చేసి గంటల వ్యవధిలోనే విధులకు హాజరయ్యారు. కరోనా కోరలు చాచి భయపెడుతున్న తరుణంలో రోగులకు తమ సేవలు ఎంత ముఖ్యమో గుర్తెరిగిన వారిద్దరూ బాధను దిగమింగి వైద్యులుగా తమ బాధ్యతను నిర్వర్తించడంలో నిమగ్నమయ్యారు. వారు డాక్టర్ శిల్పా పటేల్, డాక్టర్ రాహుల్ పర్మర్. వడోదరాలోని ఎస్ఎస్జీ ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ శిల్ప పనిచేస్తున్నారు. ఆమె తల్లి కాంతా పటేల్ (77) వారం రోజులపాటు కరోనాతో పోరాడి గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు పూర్తవగానే ఉదయం 9.30 గంటలకల్లా దవాఖానకు డాక్టర్ శిల్ప హాజరయ్యారు. అన్నింటి కంటే కర్తవ్యమే ముందు అని చెప్పిన తల్లి చివరిమాటను ఆమె ఆచరించారు. డాక్టర్ రాహుల్ తల్లి కాంతా పర్మర్ (67) వృద్ధాప్య సమస్యలతో గురువారం గాంధీనగర్లో మరణించారు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి శుక్రవారం తిరిగి వడోదరా వచ్చిన రాహుల్ ఆ రోజే విధుల్లో చేరారు. కరోనా చికిత్స విభాగానికి నోడల్ అధికారిగా ఆయన సేవలందిస్తున్నారు. గత ఏడాది ఆయనకు కరోనా సోకింది. 5 రోజులమ చికిత్స తర్వాత కోలుకున్నారు.