హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మక్కల దిగుబడిలో తెలంగాణ రైతులు అరుదైన రికార్డు సృష్టించారు. ఖమ్మం జిల్లాలో పలువురు రైతులు ఎకరానికి 50 క్వింటాళ్ల మక్కలను పండించారు. సహజ ఎరువులు, పంటల మార్పిడితో ఈ ఘనత సాధించారు. మక్కల దిగుబడిలో ప్రపంచ సగటు దిగుబడి ఎకరానికి 23.57 క్వింటాళ్లు ఉండగా.. అమెరికా సగటు దిగుబడి అత్యధికంగా 42.62 క్వింటాళ్లుగా ఉన్నది. ఖమ్మం రైతులు దానిని మించి 50 క్వింటాళ్లు పండించడం విశేషం. తెలంగాణలో ఐదేండ్లలో మక్కల దిగుబడిని పరిశీలిస్తే యాసంగిలో సగటున ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడి నమోదైంది. ఈ ఏడాది అధికారులు 28 క్వింటాళ్లుగా అంచనా వేశారు. ఖమ్మం రైతులు మాత్రం అంచనాకు మించి రెట్టింపు దిగుబడి సాధించారు.
ఈ యాసంగిలో తెలంగాణలో 4.66 లక్షల ఎకరాల్లో మక్క సాగయింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లనే అధిక దిగుబడి సాధ్యమయిందని రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా సహజ ఎరువులను ఉపయోగించడం, పంట మార్పిడితో విజయం సాధించామని పేర్కొంటున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించకండా పంటసాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు వాడినట్టు రైతు కృష్ణారావు తెలిపారు. దీనివల్ల పంట మంచిగా ఎదిగిందని, ఎకరాకు 50.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని చెప్పారు. పీ-161 (పయోనీర్) రకం విత్తనాలను సాగుచేసినట్టు తెలిపారు. సహజ ఎరువులను వాడటంతోపాటు పంట మార్పిడి చేసినట్టు మరోరైతు నల్లమోతు వెంకటరమణ తెలిపారు. అడ్వాంట-751 రకం మక్క విత్తనాలను సాగు చేసినట్టు వివరించారు.