న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు త్రిలోచన్ సింగ్ వజీర్ ఢిల్లీలోని ఒక అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. మోతీ నగర్ ప్రాతంలోని అపార్ట్మెంట్ బాత్రూమ్లో కుళ్లిన ఆయన మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన వస్తున్నదని పొరుగువారు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి పరిశీలించామని తెలిపారు. వజీర్ మొబైల్ ఫోన్ ఆయన మృతదేహం పక్కన పడి ఉన్నదని అన్నారు. అపార్ట్మెంట్ డోర్ బయట నుంచి గడియ పెట్టి ఉన్నదని పోలీసులు చెప్పారు. దీంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. త్రిలోచన్ సింగ్ వజీర్ మరణించిన ఇంటిని హరిప్రీత్ సింగ్ ఖల్సా అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, త్రిలోచన్ సింగ్ వజీర్ ఈ నెల 3న ఢిల్లీ నుంచి కెనడా వెళ్లాల్సి ఉన్నది. దీని కోసం ఆయన జమ్ముకశ్మీర్ నుంచి ఢిల్లీ వచ్చారు. అయితే ఆయనతో కాంటాక్ట్ కాలేకపోవడంతో కుటుంబ సభ్యులు జమ్ముకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పశ్చిమ ఢిల్లీ డీసీపీ ఉర్విజ గోయల్ తెలిపారు. త్రిలోచన్ సింగ్ మోతీనగర్లోని అపార్ట్మెంట్కు ఎలా వచ్చారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు తమ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ వజీర్ అకాల మరణంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు.