బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ ఆరోపణల కేసు దర్యాప్తు కొలిక్కి చేరుతున్నది. ఈ కేసులో గత ఏడాది అరెస్టయిన పలువురు మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు ఫోరెన్సిక్ రిపోర్టులు తేల్చాయని బెంగళూరు పోలీసులు మంగళవారం వెల్లడించారు. కన్నడ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదితోపాటు పార్టీ నిర్వాహకుడు వీరెన్ ఖన్నా, మాజీ మంత్రి దివంగత జీవరాజ్ అల్వ కుమారుడు ఆదిత్య అల్వ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. తాము సేకరించిన శాంపిళ్లను పరీక్షల కోసం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపామని, అక్కడ నుంచి వచ్చిన రిపోర్టుల్లో వారంతా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియాకు తెలిపారు.