ఇంద్రవెల్లి, ఏప్రిల్ 22 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం ఇంద్రాదేవికి గురువారం చైత్రమాసం పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ పూజలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గాదిగూడ మండలం అర్జుని, సిరికొండ మండలం వాయిపేట్, బంగారిగూడ, ఆదిలాబాద్ మండలం రామన్గూడ గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు కుటుంబసమేతంగా ఇంద్రాదేవి ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దేవిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయం ప్రకారం సామూహిక వంటలు చేసి నైవేద్యాలను వండారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇంద్రాదేవికి చైత్రమాసం ప్రత్యేక పూజలు చేసేందుకు ఆదివాసీ గిరిజనులు తరలిరావడంతో ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. కుటుంబసమేతంగా బంధువులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఇవి కూడా చదవండి
చిన్న వ్యాపారుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా, మాస్టర్ కార్డ్ ఏం చేశాయంటే..!
జీడబ్ల్యూసీ ఎన్నికల్లో బీసీలకు టీఆర్ఎస్ పెద్ద పీట