ముంబై: చనిపోయిన ఒక చెట్టుకు ఒక స్కూల్ కొత్త రూపాన్ని ఇచ్చింది. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే పెన్సిల్ మాదిరిగా రూపుదిద్దుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మహారాష్ట్ర పూణే జిల్లాలోని వాయి నగరంలో ద్రవిడ్ హైస్కూల్ ఎంట్రన్స్ వద్ద ఉన్న ఓక్ చెట్టు కొన్నేండ్లగా చనిపోయి శిథిలావస్థకు చేరింది. ఆ చెట్టు మోడు ప్రమాదకారంగా మారింది.
డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఈ స్కూల్ ప్రిన్సిపల్ మోనే దానిని తొలగించాలని తొలుత అనుకున్నారు. అయితే అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించారు. చెట్టు మొదలు గట్టిగా ఉండటంతో దానికి అందమైన ఆకృతి ఇవ్వాలని నిర్ణయించారు. స్కూల్ కార్పెంటర్కు చెప్పి పెన్సిల్ ఆకారంలో చెక్కించారు.
చివరకు దానికి పెయింట్ వేయడంతో ఆరు అడుగుల ఎత్తైన అందమైన పెన్సిల్ ఆకృతిని సంతరించుకున్నది. ఆ స్కూల్తోపాటు స్థానికులకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ భారీ పెన్సిల్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.