బెంగళూరు: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా తన క్యాబినెట్లోని మంత్రులకు శాఖల కేటాయింపు చాలా సున్నితమైంది.. అదే సమస్య కర్ణాటక నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బస్వరాజ్ ఎస్ బొమ్మైకు తలెత్తింది. తన క్యాబినెట్ సహచరులను సంతోషపెట్టలేకపోయారు. బస్వరాజ్ ఎస్ బొమ్మై తన క్యాబినెట్లోకి తీసుకున్న ఆనంద్ సింగ్.. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా.. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కుప్పకూలడంలో కీలకంగా వ్యవహరించారు.
ఆనంద్సింగ్ తనకు కేటాయించిన శాఖలపై అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఆయనకు టూరిజం, ఎకాలజీ, పర్యావరణ శాఖలను బస్వరాజ్ ఎస్ బొమ్మై కేటాయించారు. తనకు ఈ శాఖలు కేటాయించాలని కోరలేదన్నారు. పార్టీ ప్రతినిధిగా దీనిపై బహిరంగ వ్యాఖ్య చేయబోనన్నారు ఆనంద్ సింగ్. మరోసారి సీఎం బస్వరాజ్ బొమ్మైని కలిసి చర్చిస్తానని చెప్పారు.
బస్వరాజ్ ఎస్ బొమ్మై క్యాబినెట్లోకి తీసుకున్న ఎంటీబీ నాగరాజ్ కూడా అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఆయన తనకు కేటాయించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చక్కెర శాఖలపై అసమ్మతి తెలిపారు. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి కారణమైన మాజీ కాంగ్రెస్ నేత ఎంటీబీ నాగరాజు కావడం గమనార్హం.
గత నెల 28వ తేదీన సీఎంగా ప్రమాణం చేసిన బీఎస్ బొమ్మై స్పందిస్తూ ఆనంద్ సింగ్తో తాను ప్రతి అంశాన్ని చర్చించానని చెప్పారు. ఎంటీబీ నాగరాజుతోనూ చర్చిస్తానన్నారు. మంత్రుల అందరికీ వారు కోరుకున్న శాఖలు కేటాయించడం కష్ట సాధ్యం అని పేర్కొన్నారు.