దిస్పూర్ : ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. భద్రతా రీత్యా మిజోరం వైపు ఎవరూ వెళ్లొద్దని తమ పౌరులకు అసోం ప్రభుత్వం సూచన చేసింది. సరిహద్దు వివాదంలో అసోం ప్రజలను రెచ్చగొట్టే విధంగా మిజోరం స్టూడెంట్స్, కొన్ని యూత్ ఆర్గనైజేషన్స్ ప్రకటనలు చేస్తున్నాయని అసోం ప్రభుత్వం పేర్కొన్నది. మిజోరం పౌరుల వద్ద ఆటోమేటిక్ వెపన్స్ భారీగా ఉన్నాయని.. అసోం పోలీసుల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అది బయటపడిందని తెలిపింది. ఈ క్రమంలో మిజోరం రాష్ర్టానికి రాకపోకలు కొనసాగించొద్దని, ఆ రాష్ర్టంలో ఉంటున్న అసోం వాసులు జాగ్రత్త ఉండాలని సూచించింది.
అసోం, మిజోరం సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు తటస్థ బలగాలను మోహరించడానికి ఇరు రాష్ర్టాలు అంగీకరించిన విషయం విదితమే. కేంద్రం హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో రెండు రాష్ర్టాల సీఎస్లతో బుధవారం జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు ఒప్పందానికి వచ్చాయి. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి.
అసోం, మిజోరాం సరిహద్దులోని కచార్ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్న ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు మరణించారు. ఓ ఎస్పీ సహా 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఇరు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సరిహద్దు సమస్యపై ఇరు రాష్ర్టాల మధ్య గతేడాది ఆగస్టు, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.