న్యూఢిల్లీ: ద్రవ్య లోటు గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా.. ప్రస్తుతం ఉన్న తరుణంలో కొత్తగా రుణాలైనా తీసుకురావాలని లేదా కరెన్సీని ముద్రించాలని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. 2020-21 సంవత్సరానికి జీడీపీ మైనస్ 7.3 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. డబ్బును విరివిగా ఖర్చు చేయాల్సిన సందర్భంగా వచ్చిందన్నారు. ఆయా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ వాటా అందకపోవడం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు చేరిందని, లక్షల సంఖ్యలో జనం దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆయన అన్నారు. ద్రవ్యలోటు గురించి ఆందోళన చెందాల్సిన సమయం ఇది కాదు అని, ద్రవ్యలోటు 6.5 శాతానికి పెరిగినా సమస్య లేదని, కానీ గత ఏడాది తరహాలో మరో ఏడాదిని కోల్పోలేమని, కానీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు చూస్తే, మరో ఏడాదిని మనం కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఈ దశలో చాలా ధైర్యంగా అడుగువేసి ఖర్చును పెంచాలని చిదంబరం సలహా ఇచ్చారు. అప్పుచేసైనా, కరెన్సీ ముద్రించి అయినా.. డబ్బును మాత్రం ఖర్చు చేయాలన్నారు.