వరంగల్ : మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే జరుగుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లి, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..కొన్ని సమీకరణాలు దృష్ట్యా పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు.
పార్టీ నిర్ణయాన్ని కాదని విప్ ధిక్కరిస్తే క్రమ శిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడం బాధాకరమన్నారు. గెలుపోందిన వారు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారంతోపాటు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
మంత్రి గంగుల కమలాకర్..నేను కూడా మున్సిపల్ కౌన్సిలర్గా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీని నమ్ముకొని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే అవకాశాలు వస్తాయన్నారు. షీల్డ్ కవర్లో పార్టీ అధిష్ఠానం మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎవరి పేరు ప్రతిపాదించనా స్వాగతించాలన్నారు.
మరో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ..గ్రేటర్ వరంగల్లో 48 కార్పొరేటర్ స్థానాలు గెలవడం శుభ సూచికం అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందన్నారు.