చండీగఢ్: మరో ఏడు నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముందుకొస్తున్నాయి. పంజాబీల ఆధిపత్యం గల సరిహద్దు రాష్ట్రంలో తొలిసారి దళిత్- హిందూ ఓటర్ల కాంబినేషన్ కేంద్ర బిందువుగా మారుతున్నది. కేంద్రం లోని ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ.. దళిత్-హిందూ ఫార్ములాను ముందుకు తెచ్చింది. తత్ఫలితంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష అకాలీదళ్ కూడా ఈ ఫార్ములా అమలు చేయడానికి పూనుకున్నాయి.
పంజాబ్లో రాజకీయ సమీకరణాలు, కులాల ఆధిక్యతలు, రాజకీయ పార్టీల తీరుతెన్నులపై ఓ లుక్కేద్దాం..
ఇప్పటివరకు ఇటు కాంగ్రెస్, అటు శిరోమణి అకాలీదళ్.. రాష్ట్ర జనాభాలో 19 శాతంగా ఉన్న జాట్ సిక్కులపైనే ఆధారపడి రాజకీయాలు చేశాయి. కానీ ఈ దఫా 70 శాతంగా ఉన్న దళిత్-హిందూ ఓటు బ్యాంక్పై కేంద్రీకరించాయి.
రాంగ్గరిహియా సామాజిక వర్గానికి చెందిన జ్ఞాని జైల్సింగ్ మినహా 1967 తర్వాత పంజాబ్కు జాట్యేతర సీఎం నియమితులు కాలేదు. దీన్ని బట్టి రాష్ట్ర రాజకీయాల్లో దళితులు, హిందువులు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యారో అవగతం అవుతుంది.
ఉగ్రవాద రాజకీయాల హయాం తర్వాత అధికారం కోసం తపన అన్ని పార్టీలు రాజకీయ పునరేకీకరణపై కేంద్రీకరించాయి. జాట్ సిక్కుల ఆధిపత్యం గల రాష్ట్రంలో సిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా శిరోమణి అకాలీదళ్ పార్టీకి ఉన్న ట్యాగ్కు వచ్చిన ముప్పేమీ లేదు.
ప్రజల మద్దతు కూడగట్టేందుకు రైతుల ఉద్యమానికి అకాలీదళ్ పార్టీ మద్దతు పలికింది. బీజేపీతో 27 ఏండ్ల అనుబంధానికి స్వస్తి పలుకుతూ హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. దళితుల ఓటు బ్యాంకును ద్రుష్టిలో పెట్టుకునే బీఎస్పీతో అకాలీదళ్ జత కట్టింది.
మరోవైపు హిందూ సిక్కులకు డిప్యూటీ సీఎం పదవినిస్తామని అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. తద్వారా తమ హిందూ ఓటు బ్యాంకు దెబ్బ తినకుండా చూసుకుంటున్నారు.
ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో సీఎం అమరిందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవ్జ్యోతి సిద్ధూ మధ్య ఉప్పూనిప్పూగా ఉంది. ఇక తిరిగి సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు అమరిందర్ సింగ్.
కానీ దళిత్- హిందువులకు డిప్యూటీ సీఎం ఫార్మూలా సరిగ్గానే అర్థం చేసుకున్న అమరిందర్ సింగ్.. తిరిగి సీఎం కావాలన్న తన ఆశలను అడియాసలు చేస్తుందని భావిస్తున్నారు.
అందుకే పీసీసీ అధ్యక్షుడిగా హిందూ సిక్కును నియమించి, సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతూ వచ్చారు. హిందువులు కొంత ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోదరభావాన్ని దెబ్బ తీయకుండా జాగ్రత్తలు పడాలని అభిప్రాయ పడుతున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్ష పదవిలో సిక్కులు ఉంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వాదించారు.
హర్యానా మోడల్ రాజకీయాలను పంజాబ్లోనూ తీసుకు రావాలని బీజేపీ భావిస్తున్నది. రాజకీయ పునరేకీకరణ ద్వారా జాట్యేతరుడు మనోహర్లాల్ ఖట్టర్ను సీఎంగా చేసింది. ఇదే ఫార్మూలాను పంజాబ్లోనూ ఉపయోగించేందుకు సిద్ధం అవుతున్నది.
కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ఏనాడూ దళితులు, హిందువులకు ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. దీన్ని నిజం చేస్తూ 39 శాతం మంది జనాభా గల దళితులను తమ అక్కున చేర్చుకునేందుకు బీజేపీ సంసిద్ధమైంది. అందుకే తాము గెలిస్తే దళితుడ్ని సీఎం చేస్తామని ప్రచారం చేస్తున్నది.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. పార్టీ ఎమ్మెల్యే, విపక్ష నేత హర్పాల్సింగ్ చీమా దళిత సామాజిక వర్గ నేత. అయితే, కుల పరమైన రాజకీయాలు పరస్పర సహకార సోదరభావాన్ని దెబ్బ తీస్తాయని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.