మీరట్ : బారాత్లో భాగంగా గుర్రంపై ఊరేగితే చంపేస్తామని దళిత యువకుడిని బెదిరించిన ఘటన యూపీలోని సర్ధానా ప్రాంతంలో వెలుగుచూసింది. పెండ్లి వేడుకలో నిర్వహించే బారాత్లో గుర్రంపై ఊరేగితే హత్య చేస్తామని బెదిరించారని దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనికి భద్రత కల్పించారు. పోలీసులు భద్రత కల్పించడంతో యువకుడు కుటుంబసభ్యుల ఆనందోత్సాహాల మధ్య బారాత్ వేడుకలో పాల్గొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే ప్రాంతంలో ఉండే అగ్రకులాల వారు దళిత యువకుడిని గుర్రంపై ఊరేగితే హత్య చేస్తామని బెదిరించారని యువకుడి తండ్రి మంగేరాం సర్ధానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తమకు పోలీసు భద్రత కల్పించాలని కోరారు. మంగేరాం ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా తాము పెండ్లికొడుకు గుర్రంపై ఊరేగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఇటీవలే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించడంతో తమ ఇంటిమీదుగా వెళ్లే సమయంలో లౌడ్ స్పీకర్ వాడవద్దని కోరామని చెప్పాడు. అయితే దళిత యువకుడి కుటుంబ సభ్యులు నిందితుడి వివరణను తోసిపుచ్చారు.గతంలోనూ ఈ ప్రాంతంలో కుల వివక్ష, అల్లర్లు మామూలేనని చెప్పారు. తమ పండుగలను అగ్రకులాల వారు పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపించారు.