బెంగళూరు: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతున్నది. అయినా అంటరాని తనం వంటి దురాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దళితులపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నది. తన నాలుగేండ్ల కొడుకు పుట్టిన రోజున గుడికి తీసుకెళ్లాడో తండ్రి. గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నారు. అయినా వారివల్ల ఆలయం అపవిత్రమయిందని గ్రామపెద్దలు ఆ కుటుంబానికి జరిమానా విధించారు. ఈ నెల 4న కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొప్పాల్ జిల్లాలోని మియాపుర గ్రామంలో చెన్నదాస కమ్యూనిటీకి చెందిన 30 కుటుంబాలు ఉంటున్నాయి. వారంతా దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందులో ఓ నాలుగేండ్ల బాలుడు ఈ నెల 4న పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భం ఆ బాలుడు తన తండ్రితో కలిసి గ్రామంలో ఉన్న గుడికి వెళ్లాడు. అయితే వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా పూజారి అడ్డుకున్నాడు. దీంతో వారు గుడి బయటి నుంచే ఆ భగవంతుడిని మొక్కుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే.. ఈ ఘటనపై సెప్టెంబర్ 11న గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఆ తండ్రీ కొడుకుల వల్ల ఆలయం అపవిత్రమయిందని.. వారికి రూ.25 వేలు జరిమానా విధించారు. దీంతోపాటు ఆలయ శుద్ధికి ఖర్చుగా మరో రూ.10 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అంత పెద్దమొత్తం చెల్లించలేమని వేడుకున్నప్పటికీ వారు వినకపోవడంతో విషయాన్ని పోలీసులకు తెలిపారు. అయితే ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి ఒప్పుకోలేదని, దీంతో తాము ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
కాగా, మియాపూరకు వెళ్లిన పోలీసులు గ్రామపెద్దలతో సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగేత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వారు బాధిత కుటుంబానికి క్షమాపనలు చెప్పారని తహసీల్దార్ సిద్దేశ్ వెల్లడించారు. వచ్చే శనివారం.. గ్రామంలోని అన్ని వర్గాలతో ఆలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ టీ శ్రీధర్ చెప్పారు.