దిండగుర్: కర్నాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చెన్ననారాయపట్న తాలూకాలోని దిండగురు గ్రామ దళితులు తొలిసారి ఆలయాలను విజిట్ చేశారు. పోలీసులు, ఉన్నత అధికారుల సమక్షంలో ఆ ఊరి ఎస్సీలు ఈనెల 28వ తేదీన ఆలయాలను సందర్శించారు. గుళ్లకు వెళ్తామని ఇటీవల ఆ ఊరి దళితులు తాలూకా అధికారులకు లేఖ రాశారు. అయితే తహిసిల్దారు జేబీ మారుతి, డిప్యూటీ ఎస్పీ లక్ష్మీ గౌడలు గ్రామ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉన్నత కులస్తులతోనూ వాళ్లు సమావేశం పెట్టి.. దళితులు ఆలయ ప్రవేశం చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఆలయాలకు వెళ్లేందుకు దళితులకు ఎటువంటి ఆంక్షలు లేవని తహిసిల్లాదర్ తెలిపారు. వారికి రక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న మల్లేశ్వర ఆలయం, బసవన్న ఆలయం, సంత్యమ్మ, కేశవ ఆలయాలను దళితులు సందర్శించుకున్నారు. తొలిసారి గుడిలోకి అడుగుపెట్టినట్లు ఆ ఊరికి చెందిన 75 ఏళ్ల తిమ్మయ్య సంతోషం వ్యక్తం చేశారు.