ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తౌక్తే తుఫాన్ తీరంవైపు దూసుకొస్తున్నది. మరికొన్ని గంటల్లో అది మహారాష్ట్ర తీరానికి చేరుకోనున్నది. ప్రస్తుతం తౌక్తే తుఫాన్ తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని, ఈ రాత్రికిగానీ లేదంటే రేపు ఉదయంగానీ అది మహారాష్ట్ర తీరానికి చేరుకుంటుందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కమాండెంట్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ నేపథ్యంలో తాము ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని శ్రీవాస్తవ చెప్పారు. ముంబై తీర ప్రాంతాల్లో మూడు, గోవా తీరంలో ఒకటి, పుణె హెడ్ క్వార్టర్స్ దగ్గర 14 టీమ్లు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ తుఫాన్ పశ్చిమ తీర ప్రాంతానికి దూరంగానే ఉన్నందున ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందన్నారు. అయితే బలమైన గాలులు, సాధారణ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.