భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుఫాన్గా మారి బాలసోర్ సమీపంలో తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయవ్య దిశగా కదులుతున్న తుఫాన్ క్రమంగా బలహీనపడుతున్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. యాస్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్ రెండు రాష్ట్రాల్లో దాదాపు 52 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. పలుచోట్ల ఆవాసాలు పూర్తిగా నీట మునిగాయి. వృక్షాలు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. కాగా, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఇప్పటికే 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.