అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్గా కొనసాగుతున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్వల్ల నెల్లూరులోని దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువ తీరం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని వెల్లడించింది. సముద్రంలో అలలు రెండున్నర నుంచి ఐదు మీటర్ల వరకూ ఎగసిపడతాయని తెలిపింది.
మత్స్యకారులు రేపటివరకు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాన్ ఉత్తర ధమ్రా-ఒడిశాలోని బాలాసోర్ మధ్య ఈ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 60 నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని కన్నబాబు తెలిపారు.