టీకాలు ఎక్కువగా విడుదల చేయాలి
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి ఈటల
రాష్ర్టాలతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. 10, 20 రోజులకు సరిపడేలా వ్యాక్సిన్ సరఫరా చేయాలని, ఎలాంటి కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తిచేశారు. సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ 11 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఈటల పాల్గొన్నారు.
కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ర్టాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఈటల చెప్పారు. తెలంగాణలో వైరస్ వ్యాప్తి పరిస్థితులను వివరించారు. సరిహద్దు రాష్ర్టాల నుంచి తెలంగాణకు వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ గురించి తెలియజేశారు. ఐహెచ్ఐపీ (ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫాం) యాప్పై జరిగిన సమీక్ష సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 33 రకాల అంటు వ్యాధుల వ్యాప్తిని రియల్ టైంలో తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యాప్ను తెలంగాణ ప్రభుత్వం పైలట్ బేసిస్ కింద 2018 నుంచి వినియోగిస్తున్నదని తెలిపారు. గ్రామీణస్థాయిలో ఏఎన్ఎంలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో మెడికల్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్లకు ట్రైనింగ్ అందించినట్టు చెప్పారు.