న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా మారనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ‘గులాబ్’గా పేరుపెట్టిన ఈ తుపాను ఆదివారం సాయంత్రం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒడిశా, ఏపీ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విశాఖపట్నం నుంచి గోపాల్పూర్ వరకు ఉన్న తీర ప్రాంతాలపై ఇది ప్రభావం చూపవచ్చని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది.
మరోవైపు ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్సీ) పీకే జెనా సహాయక ఏర్పాట్లపై సమీక్షించారు. తుపాను బాగా ప్రభావితం చూపే ఏడు జిల్లాలైన గంజం, గజపతి, కోరాపుట్, రాయగడ, నవరంగ్పూర్, కంధమాల్, మల్కన్ గిరి జిల్లాల కలెక్టర్లను హై అలర్ట్లో ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడు జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది.