న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరంవైపు దూసుకొస్తున్నది. దాంతో రెండు రాష్ట్రాల సీఎంలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి.. ఈ విపత్తును ఎదుర్కొనే అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్లు చేసి మాట్లాడారు.
ఆ రెండు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ గురించి ఆందోళన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. అంతేగాక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. కాగా, రెండు రాష్ట్రాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి. ఒడిశాలో ఓడీఆర్ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.