న్యూయార్క్ : భారత సంతతికి చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ శంకర్ ఘోష్ పరిశోధన రంగంలో సాధించిన విజయాలకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఎంపికయ్యారు. ఘోష్ కొలంబియా యూనివర్సిటీ అనుబంధ వెగీలాస్ కాలేజ్ మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. అకాడమీ గత వారం ప్రకటించిన 120 మంది నూతన సభ్యుల్లో ఘోష్ ఒకరని కొలంబియా వర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
క్యాన్సర్ నుంచి మధుమేహం వరకూ రోగనిరోధక వ్యవస్థకు, వ్యాధులకు మధ్య ఉన్న సంబంధంపై ఘోష్ పరిశోధన సాగిందని తెలిపింది. రోగనిరోధక వ్యవస్థ, పలు వ్యాధులకు దారితీసే పాథలాజికల్ మార్పుల గుట్టుమట్లను మెరుగ్గా అర్ధం చేసుకునే దిశగా పరిశోధనలు చేపట్టడం పట్ల ఘోష్ ఆసక్తి కనబరిచేవారని పేర్కొంది. 2008లో కొలంబియా వర్సిటీలో చేరిన శంకర్ ఘోష్ అంతకుముందు హావర్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో ఇన్వెస్టిగేటర్ గా వ్యవహరించారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్స్ లోనూ ఫెలోగా సేవలందించారు.