న్యూఢిల్లీ : ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరుగనున్నది. ప్రస్తుత రాజకీయాలు, రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, యూపీ పరిణామాలతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నది. ఢిల్లీలోని కార్యాలయంలో సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ శనివారం ట్వీట్ చేశారు. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాలు, జీ-23 నేతలు సహా పార్టీలో అంతర్గత పోరు, కలహాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్తో సహా పలువురు నాయకులు ఇటీవల సోనియా గాంధీకి పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాలని లేఖ రాశారు. ఈ క్రమంలో సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది. భేటీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికలపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఏడు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉన్నది.