వాషింగ్టన్, మే 14: కరోనా టీకాలు పూర్తిగా వేసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కు ధరించకుండానే బయట తిరుగవచ్చని ఆ దేశానికి చెందిన అత్యున్నత వైద్య నియంత్రణ సంస్థ ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ (సీడీసీ) గురువారం ప్రకటించింది. దీనిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వెంటనే పాటించారు కూడా. వైట్హౌస్ రోజ్గార్డెన్లో విలేకర్లతో జరిగిన సమావేశంలో వారిద్దరూ ముఖానికి మాస్కులు లేకుండానే మాట్లాడారు. ‘ఇదొక గొప్ప మైలురాయి. గొప్ప సుదినం. ఎంతో వేగంగా అనేకమంది అమెరికన్లకు టీకాలు వేయటం ద్వారానే ఇది సాధ్యమైంది’ అని బైడెన్ చెప్పారు.టీకాలను పూర్తిగా వేసుకున్న వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం చాలా, చాలా తక్కువ అని తెలిపారు. ఇప్పటికీ టీకాలు వేసుకోనివాళ్లు, రెండుడోసుల్లో ఒక్క డోసు మాత్రమే వేసుకున్నవాళ్లు, రెండో డోసు వేసుకొని ఇంకా రెండువారాలు పూర్తికానివాళ్లు మాత్రం తప్పకుండా మాస్కు ధరించాలని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 114 రోజుల్లో 25 కోట్లమంది అమెరికన్లకు టీకాలు వేశామని బైడెన్ తెలిపారు.
ప్రయాణాల్లో కరోనా టెస్టులు అవసరం లేదు
సీడీసీ తాజా మార్గదర్శకాల ప్రకారం.. అమెరికాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేవాళ్లు ప్రయాణానికి ముందు, తర్వాత ఇకమీదట కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణం తర్వాత క్వారంటైన్ అవసరం లేదు. కరోనా రాకుండా టీకాలు గణనీయమైన రక్షణ కల్పిస్తున్నాయని, ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం, మరణం సంభవించకుండా కాపాడుతున్నాయని సీడీసీ తెలిపింది.