భోపాల్: మధ్యప్రదేశ్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే కరోనా మృతుల సంఖ్యకు శ్మశానవాటికల్లో జరుగుతున్న అంత్యక్రియల లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా మృతుల సంఖ్యను ప్రభుత్వం దాస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని శ్మశాన వాటికలకు అంత్యక్రియల కోసం మృతదేహాలు పోటెత్తుతుండటమే దీనికి కారణం. భోపాల్లోని భద్భదా శ్మశానవాటికకు గత కొన్ని రోజులుగా 30 నుంచి 50 మృతదేహాలను అంత్యక్రియల కోసం అంబులెన్స్లలో తీసుకొస్తున్నారు. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన నాటి పరిస్థితులను ఇది కళ్లకు కడుతున్నదని స్థానికులు అంటున్నారు.
మరోవైపు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 37 కరోనా మరణాలు నమోదైనట్లు మధ్యప్రదేశ్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఒక్క భోపాల్లోని భద్భదా శ్మశానవాటికలో అదే రోజు 37 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. అలాగే ఈ నెల 8న మధ్యప్రదేశ్లో 27 మంది కరోనా చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఒక్క భోపాల్లోని శ్మశానవాటికలో 41 మృతదేహాలకు కరోనా నిబంధనలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా 23 మంది కరోనాతో చనిపోయినట్లు తెలుపగా భోపాల్ శ్మశానవాటికలో 35 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.
అలాగే ఈ నెల 10న కరోనాతో 24 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించగా ఒక్క భోపాల్లోనే 56 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. 11న కూడా 24 కరోనా మరణాలుగా పేర్కొనగా నగరంలో 68 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. ఈ నెల 12న మధ్యప్రదేశ్లో 37 కరోనా మరణాలు నమోదైనట్లు అధికార గణాంకాలు చెబుతుండగా ఒక్క భోపాల్లోనే 59 మృతదేహాలకు కరోనా నిబంధనలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు అక్కడి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వరుసగా వచ్చిపడుతున్న మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేక శశ్మానవాటికల సిబ్బంది కూడా చేతులెత్తుస్తున్నారు. తమకు కొంచమైనా విరామం ఉండటంలేదంటున్నారు. మరోవైపు అంత్యక్రియలకు వినియోగించే కట్టెలకు డిమాండ్ బాగా పెరిగిందని సంబంధిత వ్యాపారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా మృతుల సంఖ్యను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తగ్గించి చెబుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. కరోనా మృతుల వాస్తవ సంఖ్యను దాచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఇలా చేయడం వల్ల తమకు ఎలాంటి అవార్డు రాదని మంత్రి విశ్వస్ సారంగ్ తెలిపారు.