మండలంలోని కొత్తగూడెం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పలు అభివృద్ధి పనులతో కొత్తదనం సంతరించుకున్నది. గ్రామంలో రైతు వేదిక, పల్లె పకృతి వనం, డబుల్ బెడ్రూం ఇండ్లు, వైకుంఠధామం, సీసీ రోడ్లు నిర్మించారు. మిషన్ కాకతీయతో పటిష్టమైన చెరువు కట్ట నిర్మించగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు, వీధుల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. పశు వైద్యశాల, యూపీఎస్ స్కూల్, అంగన్వాడీ స్కూల్ను ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ప్రతి ఒక్కటీ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తున్నది. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం పరుచుకోగా ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తూ గ్రామాన్ని సుందరంగా మార్చారు.
రైతు వేదిక రెడీ
గ్రామంలో రూ.22 లక్షలతో రైతు వేదికను నిర్మించారు. అన్ని హంగులతో దీన్ని పూర్తి చేయడంతో ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నది.
పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లు
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు గ్రామంలో రూ.1.10 కోట్లతో 20 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇవి అర్హులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
పల్లె ప్రకృతి వనం
గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని రూ.3.5 లక్షలతో ఏర్పాటు చేశారు. గ్రీన్ బడ్జెట్ కింద 10 శాతం నిధులు వీటికి ఉపయోగించారు. హరితహారం మొక్కలను పెంచేందుకు నర్సరీని కూడా ఏర్పాటు చేశారు.
వైకుంఠధామంతో తీరిన సమస్య
గతంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించాలంటే సరైన వసతుల్లేక గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడేవారు. నేడు వైకుంఠధామం పూర్తితో ఆ సమస్య తీరింది. వైకుంఠధామానికి రూ.10.50 లక్షలు మంజూరు కాగా అన్ని సౌకర్యాలతో నిర్మించారు. గ్రామ శివారులో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు కట్టను పటిష్ట పరిచారు. డంపింగ్ యార్డు స్థల మార్పిడి వల్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఇక గ్రామంలో పశు వైద్యశాల, ప్రాథమికోన్నత పాఠశాల, రెండు అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామంలో 80 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాగా మరో 20 శాతం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
అన్నీ సీసీ రోడ్లే..
గతంలో వర్షం వస్తే వీధులు బురదమయంగా మారేవి. కొంతకాలం నుంచి విడుతల వారీగా గ్రామంలోని రోడ్లను సీసీ రోడ్లుగా మార్చారు. దీనితో వీధులన్నీ అందంగా తయారయ్యాయి. ము రుగు కాల్వల్లో చేరిన చెత్త, చెదారాన్ని, ప్రతి ఇంటి నుంచి చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు.
మా ఊరు మారింది
గతంలో తాగునీరు అందించి, పారిశుధ్యంపై దృష్టి పెట్టి, వీధిలైట్లు వెలిగేలా చూస్తే చాలు అది అభివృద్ధి అనుకునే వాళ్లం. కానీ నేడు పల్లెలను పట్టణాలకు దీటుగా రూపొందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. పల్లె ప్రగతితో మా గ్రామం అందంగా మారింది. వలస వెళ్లిన వారు అభివృద్ధిని చూసి గ్రామంలో తమకంటూ ఇల్లు ఉండాలని కట్టుకుంటున్నారు.
-మద్దెల శ్రీలతావిక్టర్, సర్పంచ్, కొత్తగూడెం
ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం..
మండలంలో 46 గ్రామ పంచాయతీల్లో ప్రగతి విరిసేలా ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులను ప్రోత్సహిస్తున్నాం. పల్లె ప్రగతిలో చేపట్టే పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాం. కొత్తగూడెం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటున్నది.
2,023 మంది జనాభా
గ్రామంలో 686 గృహాలకు 10 వార్డులు ఉన్నాయి. 2023 మంది జనాభా,1420 మంది ఓటర్లు ఉన్నారు.
గ్రామానికి వచ్చిన నిధులు
గ్రామ అభివృద్ధికి ఎస్ఎఫ్సీ నిధులు రూ.11లక్షలు , 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.14 లక్షలు మంజూరయ్యాయి.
ఇంటింటికీ మిషన్ భగీరథ
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు పైపులు వేసి నల్లాలు బిగించారు. గ్రామంలో 90 శాతం పనులు పూర్తికాగా నీటిని సరఫరా చేస్తున్నారు.