తిరువనంతపురంః కేరళలోని అలప్పుజ జిల్లా వల్లికున్నం పదవయనివెట్టం ఆలయ ఉత్సవంలో పదిహేనేండ్ల బాలుడి హత్యోదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. బాలుడి హత్యపై సీపీఎం, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. ఆలయ ఉత్సవంలో బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య చెలరేగిన వివాదం పదో తరగతి విద్యార్ధి అభిమన్య కత్తిపోట్లకు గురవాడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎస్ఎఫ్ఐకి చెందిన అభిమన్యు హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని ఇది పూర్తిగా రాజకీయ హత్యేనని సీపీఎం అలప్పుజ జిల్లా కార్యదర్శి ఆర్ నాజర్ ఆరోపించారు. అభిమన్యు హత్యను సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.
కాగా ఈ ఆరోపణలను బీజేపీ అలప్పుజ జిల్లా కార్యదర్శి ఏవీ గోపకుమార్ తోసిపుచ్చారు. ఈ అంశాన్ని సీపీఎం రాజకీయం చేస్తోందని అన్నారు. ఈ ఘటనతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని బాలుడి తండ్రి, పోలీసు అధికారులు చెబుతున్నారని చెప్పారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులు కమ్యూనిస్టులే అయినా తమ కుమారుడు రాజకకీయాల్లో చురుకుగా లేడని బాధితుడి తండ్రి స్పష్టం చేశారు. తమ కుమారుడిని ఇలా ఎందుకు చంపారో తనకు అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.