వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 2 : రైతులు పండించిన శనగ పంట కొనుగోలు పరిమితిని పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి నివాసంలో ఆయనను కలిశారు. శనగలు ఎకరాకు ఆరు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్ల వరకు పరిమితిని పెంచాలని కోరారు. జిల్లాలో రైతులు విస్తారంగా శనగ పంట వేశారని, మంచి దిగుబడులు వచ్చి ఎకరాకు ఏడు నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలిపారు. కానీ అధికారులు ఆరు క్వింటాళ్లే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి.. ఎకరాకు శనగల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్ మేయర్గా ఎన్నికైన గద్వాల్ విజయలక్ష్మిని ఆమె నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఉన్నారు. కాగా, సొనాలలో అసంపూర్తిగా ఉన్న మున్నూరు కాపు సంఘ భవనానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తామని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు హామీ ఇచ్చినట్లు ఎంపీపీ తెలిపారు.