న్యూఢిల్లీ : భారత్లో కరోనా వ్యాక్సిన్ల లభ్యత పెరగడంతో 45 ఏండ్లు పైబడిన వారికి కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సిన్ల కొరత కారణంగానే రెండు టీకాల మధ్య విరామాన్ని పెంచారని విమర్శలు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం టీకా డోసుల మధ్య విరామాన్ని తగ్గించేందుకు కసరత్తు సాగిస్తోంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని ప్రస్తుతం అన్ని వయసుల వారికి 12 నుంచి 16 వారాలుగా నిర్ధారించారు.
టీకాల సామర్ధ్యంపై తాము సేకరించిన డేటా ఆధారంగా టీకా డోసుల విరామాన్ని తగ్గించే దిశగా రెండు మూడు వారాల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని భారత్లో వ్యాక్సినేషన్పై ఏర్పాటైన సాంకేతిక సలహా గ్రూప్ (ఎన్టీఏజీఐ) సంకేతాలు పంపింది. వచ్చే వారం ఎన్టీఏజీఐ భేటీలో ఈ దిశగా సంప్రదింపులు జరగనున్నాయి. వివిధ వయసుల వారిపై వ్యాక్సిన్ల ప్రభావం, వ్యాక్సిన్ల డోసుల మధ్య విరామం వంటి అంశాలపై తాము డేటాను సేకరించామని రెండు నుంచి నాలుగు వారాల్లోగా కొవిషీల్డ్ డోసుల మధ్య విరామం తగ్గించే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఎన్టీఏజీఐ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా వెల్లడించారు.
కొవిషీల్డ్ సింగిల్ డోస్తోనూ మెరుగైన రోగనిరోధక స్పందన కనిపించిందని శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పారు. బ్రిటన్లో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం రెండు నెలలకు తగ్గించారు. ఇక భారత్లో తొలుత కొవిషీల్డ్ డోసుల మధ్య విరామం నాలుగు వారాలు కాగా ఆపై దాన్ని 4-8 వారాలకు పొడిగించగా తాజాగా ఈ గ్యాప్ను 12 నుంచి 14 వారాలుగా నిర్ణయించారు.