ఏప్రిల్లో 4 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు
స్థానిక లాక్డౌన్లే కారణమని సీఎంఐఈ వెల్లడి
ముంబై, మే 3: కొవిడ్-19 సెకెండ్ వేవ్ ఉద్ధృతి వల్ల దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. వీటిని అదుపు చేసేందుకు చాలా రాష్ర్టాల్లో స్థానికంగా లాక్డౌన్లు విధించారు. ఫలితంగా ఏప్రిల్లో దాదాపు 75 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో నిరుద్యోగిత రేటు 8 శాతానికి ఎగబాకి నాలు గు నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ఈ పరిస్థితి మున్ముందు కూడా ఇలాగే కొనసాగి పెద్ద సవాలుగా పరిణమించవచ్చని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్లో 75 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని, నిరుద్యోగిత రేటు పెరుగుదలకు ఇదే కారణమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్లో జాతీయ నిరుద్యోగిత రేటు 7.97 శాతానికి చేరింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 9.78 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉన్నది. మార్చిలో జాతీయ నిరుద్యోగిత రేటు 6.50 శాతంగా నమోదైంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించడంతో నిరుద్యోగిత రేటు ఏకంగా 24 శాతానికి ఎగబాకింది. దీనితో పోలిస్తే ఈసారి నిరుద్యోగిత రేటు అంతగా లేకపోయినప్పటికీ సెకెండ్ వేవ్లో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో చాలా రాష్ర్టాలు స్థానికంగా లాక్డౌన్లు విధించాయి.