న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేయాలంటే లాక్డౌన్ పెట్టాల్సిందే అని నేషనల్ కొవిడ్-19 టాస్క్ ఫోర్స్లోని నిపుణులతోపాటు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా స్పష్టం చేస్తున్నారు. లాక్డౌన్ పెట్టాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కూడా ఈ నిపుణులు చెబుతున్నారు. దేశంలో రోజు రోజుకూ కేసులు, మరణాలు పెరిగిపోతుండటంతో కనీసం రెండు వారాలైనా లాక్డౌన్ పెట్టాల్సిందే అని టాస్క్ఫోర్స్లోని ఈ నిపుణులు తేల్చి చెబుతున్నారు. శనివారమైతే ఏకంగా 4 లక్షలకుపైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఈ టాస్క్ఫోర్స్లో ఎయిమ్స్, ఐసీఎంఆర్లకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ టాస్క్ఫోర్స్ కరోనా పరిస్థితులపై చర్చించడానికి పలుమార్లు సమావేశమయ్యారు. ఈ టాస్క్ఫోర్స్ చైర్పర్సన్ అయిన వీకే పాల్ నేరుగా ప్రధాని మోదీకే రిపోర్ట్ చేస్తారు. దీంతో ఈ టాస్క్ఫోర్స్ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మోదీ మాత్రం లాక్డౌన్కు అంత సుముఖంగా లేనట్లు గత నెలలో జాతిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. లాక్డౌన్ చివరి ఆప్షన్గా మాత్రమే ఉపయోగించాలని ఆ సమావేశంలో మోదీ స్పష్టం చేశారు.
అటు ఎయిమ్స్ చీఫ్ కూడా రణ్దీప్ గులేరియా కూడా లాక్డౌన్ ఒక్కటే మార్గమని తేల్చడం గమనార్హం. దేశంలో ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉన్నదని, గరిష్ఠ పరిమితికి చేరుకున్నదని ఆయన అన్నారు. గతేడాది మార్చిలో పెట్టినట్లు కఠినమైన లాక్డౌన్లు పెడితేనే కేసులను కట్టడి చేయొచ్చని ఆయన తేల్చి చెప్పారు. 10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో ఇది అమలు చేయాలని చెప్పారు. నైట్కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు అంతగా ప్రభావం చూపలేకపోతున్నట్లు గులేరియా అభిప్రాయపడ్డారు.