జైపూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఆందోళన రేకెత్తిస్తోంటే రాజస్ధాన్ రాజధాని జైపూర్లోని ఓ దవాఖాన నుంచి కరోనా వ్యాక్సిన్ 320 డోసులు గల్లంతయ్యాయి. వ్యాక్సిన్ల అదృశ్యంపై దవాఖాన అధికారుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. నగరంలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని కన్వతియ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వ్యాక్సిన్ డోసుల ఆచూకీ తెలియకపోవడంతో దవాఖానకు చెందిన హిరాలాల్ వర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరోవైపు దవాఖానలో వ్యాక్సిన్ డోసుల గల్లంతు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశిస్తుందని అధికారులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ను బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకే వీటిని మాయం చేశారని భావిస్తున్నారు.