న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఒక్కరోజులో రికార్డుస్ధాయిలో అత్యధిక టీకా డోసులు పంపిణీ చేసిన క్రమంలో ఇదే ఊపును కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ప్రతినెలా 25 కోట్ల కొవిడ్-19 టీకా డోసులను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సెప్టెంబర్లో భారత్ దాదాపు 20 కోట్ల కొవిషీల్డ్ డోసులు, 3.5 కోట్ల కొవాగ్జిన్ డోసులను సమీకరించనుందని తెలిపాయి. ఈ ఏడాది చివరికి దేశంలో మొత్తం 135 కోట్ల జనాభా అంతటికీ కనీసం టీకా ఒక డోసు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా టీకా సేకరణను వేగవంతం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
థర్డ్ వేవ్ తలెత్తుతుందనే అంచనాల నేపధ్యంలోనూ త్వరితగతిన వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకోవాలని కేంద్రం యోచిస్తతోందని అన్నారు. ఇక 24 గంటల్లో 2.47 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేపట్టి ప్రపంచరికార్డు నమోదు చేసిన చైనాను మనం శుక్రవారం 2.50 కోట్ల డోసుల పంపిణీతో అధిగమించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు.