వానకాలం రానున్న నేపథ్యంలో కమిషనర్లకు సీడీఎంఏ ఆదేశాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 16,601 నిర్మాణాల లక్ష్యం
బల్దియా కౌన్సిలర్ల నేతృత్వంలో కమిటీల ఏర్పాటు
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 22 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో వర్షపు నీటి నిల్వ కోసం పెద్ద సంఖ్యలో ఇంకు డు గుంతలను నిర్మించాలని ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్(సీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీకి నివాసిత ప్రాంతాలను బట్టి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కలిపి 16,601 నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని పేర్కొంది. ప్రైవేట్ భవనాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, భవనాలు, దవాఖానలు, వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిధుల ఇండ్లలో వీటిని నిర్మించాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఉమ్మడి జిల్లాలో వ్యక్తిగత గృహ నిర్మాణాల్లో 10,676, పాఠశాలల్లో 4,510, ప్రజాప్రతినిధుల ఇండ్లలో 410, ఫిల్టర్బెడ్స్, ట్యాంక్ బెడ్స్లలో 31, చేతిపంపులు ఉన్న చోట 950, ఇతర ప్రదేశాల్లో 27 వరకు నిర్మించాలని లక్ష్యం విధించింది. లక్ష్యాలను సాధించడానికి కౌన్సిలర్ల నేతృత్వంలో ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ బృందాలు వర్షపు నీటి గుంతలను నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేస్తాయని, వీటి నిర్మాణానికి అవసరమయ్యే వ్యయాన్ని ఖరారు చేసి, టెండర్లు కూడా పిలుస్తాయని పేర్కొంది. వీటి నిర్మాణంలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఇండ్లలో మొదట వర్షపు నీటి కోసం ఇంకుడు గుంతలను నిర్మించాలని పేర్కొంది. మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోలు, విద్యాసంస్థలు, మత సంబంధమైన ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: పడిక్కల్ ఫటాఫట్.. 27 బంతుల్లోనే హాఫ్సెంచరీ