హాలియా, ఏప్రిల్ 19 : నాగార్జున సాగర్ నియోజకవర్గంపై కరోనా వైరస్ పంజా విసిరింది. సోమవారం నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో 541 మందికి కొవిడ్ టెస్ట్లు నిర్వహించగా 170 మందికి పాజిటివ్ వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ సతీమణి నోముల భవాని, ఆయన తల్లి నోముల లక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య యాదవ్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో పాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కూడా పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు నిబంధనలు కచ్చితంగా అమలు చేశారు. అయినా ప్రజలు ఓటు వేశాక కొన్ని ప్రాంతాల్లో గుమిగూడారు. నాయకులు కూడా ప్రచారంలో భాగంగా ఓటర్లను కలువడంతో కరోనా బారిన పడినట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు.
హాలియాలో 66 మందికి పాజిటీవ్
అనుముల మండలం హాలియా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 175 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటీవ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. హాలియాలో 23, నాయుడుపాలెంలో 3, పాలెంలో 2, యాచారం 6, అనుముల 4, ఇబ్రహీంపేట 2, పంటవానికుంట 5 తిరుమలగిరి సాగర్ మండలంలోని బోయగూడెంలో 9, తిరుమలగిరి 2, అల్వాల 4, గాత్తండా, జువ్విచెట్టుతండా, అల్వాలతండా, రంగుండ్ల, డొక్కలబావితండాలో ఒక్కొక్కటి చొప్పున, పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లిలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. తిరుమలగిరి సాగర్మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా పరీక్షలు చేయగా 21 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
నిడమనూరులో ఏడుగురికి
నిడమనూరు : మండలంలోని వివిధ గ్రామాల్లో 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ మాధవ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మహిళ ఉన్నట్లు పేర్కొన్నారు.
డి.కొత్తపల్లిలో 15మందికి పాజిటివ్
నాగారం : గ్రామాల్లో కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ గాదరి రామకృష్ణ తెలిపారు. సోమవారం నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో 85 మందికి పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. 90 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ యారాల నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ పెరుమాళ్ల రవి, కార్యదర్శి అరుణ్కుమార్ ఉన్నారు.