తాను నేర్చుకున్నది నలుగురికి పంచి.. ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నది ఆమె లక్ష్యం. ఆలోచన వచ్చిందే తడవుగా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగుతూ అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థను ప్రారంభించింది. ఒక్క రూపాయి తీసుకోకుండా మహిళలు, విద్యార్థినులకు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా తోడ్పాటునందిస్తూ ముందుకు సాగుతున్నది.
ఏఎస్రావు నగర్ డివిజన్ పరిధి కమలానగర్లో నివాసముండే ధీరం ఉష మహిళా సాధికారత, ఆర్థిక చైతన్యమే లక్ష్యంగా రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. ఇందులో భాగంగా అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఫ్రో ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ను స్థాపించి వందలాది మంది మహిళలు, విద్యార్థులకు వృత్తివిద్యలో శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. ముఖ్యంగా సొంత వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్న మహిళలను ప్రోత్సహిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తాను చేస్తున్న ఈ పనికి ఒక్క రూపాయి ఆశించకుండా మహిళల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు. అంతేకాక సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో నిత్యావసరాలు, మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాలను సైతం నిర్వహించి ఎందరికో మైరుగైన వైద్యాన్ని అభయ బృంద సభ్యులు అందించారు.
హైదరాబాద్లోని చక్రీపురం, కమలానగర్లో అభయ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ, జన శిక్షణా సంస్థాన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో టైలరింగ్, శానిటరీ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, అల్లికలు, జూట్ బ్యాగులు, ఫ్యాషన్ డిజైనింగ్, పేపర్ వస్తువుల తయారీ, పెయింటింగ్స్, పచ్చళ్లు, ఫినాయిల్, సబ్బుల తయారీపై రెండు మూడు నెలలు శిక్షణ ఇస్తున్నారు. సొంతంగా యూనిట్ స్థాపించుకునే దిశగా చర్యలు తీసుకుంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు.
ఎందరో మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. వివిధ రంగాల్లో స్థిరపడిన కొంత మంది మహిళలు నెలకు రూ.40 వేలకు పైగా ఆర్జిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు సైతం శిక్షణ ఇచ్చి వారిలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. – అపర్ణ, కోశాధికారి
మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్నాం. వివిధ రంగాల్లో మహిళలకు మెరుగైన శిక్షణ ఇస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. భవిష్యత్లో అభయ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. -సుచిత్రారెడ్డి, కార్యదర్శి
మహిళలకు శిక్షణతో పాటు సామాజిక సేవలో ‘అభయ’ పాలుపంచుకుంటున్నది. కొవిడ్ 19 నేపథ్యంలో పలు సంస్థల భాగస్వామ్యంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని 80కి పైగా పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. అంతేకాక నిరుపేదలు, దివ్యాంగులకు వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన మందులు, శస్త్రచికిత్సలు చేయించేందుకు చర్యలు చేపట్టింది.
మహిళల కోసం ధీరం ఉష చేస్తున్న సేవలకు ఎన్నో అవార్డులు సొంతమయ్యాయి. 2013లో హ్యాండ్లూమ్, టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే ఉత్తమ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్త అవార్డు, 2015లో ఉత్తమ శిక్షకురాలు, 2016లో లక్ష్మీదేవి అవార్డు, 2017లో ఉ మెన్ ఎక్సలెన్సీ అవార్డు, 2020లో ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా అవార్డు ఇచ్చి సత్కరించింది.
చెన్నైలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో పీజీ పూర్తి చేసిన ధీరం ఉష 1993లో ఏఎస్రావు నగర్లో బొటిక్ను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల అనంతరం గార్మెంట్ యూనిట్ను ప్రారంభించి విజయవంతంగా నడిపించారు. 2005లో రాష్ట్ర టెక్నికల్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ నుంచి అనుమతి తీసుకొని ఫ్యాషన్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తన స్నేహితులు అపర్ణ, సుచిత్ర, ఝాన్సీ, శేషుల సహకారంతో అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వేలాది మంది మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధికి బాటలు వేస్తున్నారు.
ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు ‘అభయ’ను ఏర్పాటు చేశాం. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఇందుకోసం అనేక సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ ఇస్తున్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం సహకారమందిస్తే మహిళలకు ఉపాధి కల్పనతో పాటు కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు
తీసుకుంటాం. – ధీరం ఉష, అభయ అధ్యక్షురాలు