ముంబై: వారిద్దరు ప్రేమించుకున్నారు. రెండేండ్లపాటు కలిసి తిరిగారు. మతాలు వేరుకావడంతో వారిద్దరు ఒక్కటవ్వడానికి పెద్దలు ఒప్పుకోలేదు. ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం చూశారు. మరికొన్నిరోజుల్లో వివాహం నిశ్చయం చేశారు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో మాజీ ప్రేమికుడు ఎంటరయ్యాడు. రూ.లక్షా 50 వేలు ఇవ్వాలని, లేకపోతే తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టుచేస్తానని బెదిరించాడు. విషయం పోలీసుల వద్దకు చేరడంతో అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని నలాసొపరాకు చెందిన 24 ఏండ్ల యువకుడు, అదే గ్రామానికి చెందిన యువతి (22) ప్రేమించుకున్నారు. రెండేండ్లు కలిసి తిరిగారు. అయితే విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయం చేశారు. కొంతకాలం దూరంగానే ఉన్న యువకుడు ఆ అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. తాము ఏకాంతంగా గడిపిన వీడియోలు తనవద్ద ఉన్నాయని, రూ.1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టుచేస్తానని బెదిరించారు. అడిగినట్టుగానే ఆ అమ్మాయి తల్లి అతనికి మొత్తం డబ్బు అప్పజెప్పింది. అయినప్పటికీ అతడు.. యువతి పెళ్లిచేసుకోబోయే వ్యక్తికి ఆ వీడియోలను పంపించాడు. దీంతో అతడు పెళ్లిని రద్దుచేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు మాజీ ప్రియుడిపై నలాసొపరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి