తిరువనంతపురం : కేరళలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ను జూన్ 16 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ నియంత్రణకు ఈనెల 12, 13 తేదీల్లో పూర్తి లాక్డౌన్ పాటించాలని నిర్ణయించింది. నిత్యావసరాల దుకాణాలు, పరిశ్రమలకు ముడిపదార్ధాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, బ్యాంకులను యధావిధిగా అనుమతిస్తామని వెల్లడించింది.
ఇక కేరళలో ఆదివారం 14,672 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 227 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ చేపడతామని, కేంద్రమే వ్యాక్సిన్లు సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను కేరళ సీఎం పినరయి విజయన్ స్వాగతించారు. సరైన సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేశారని పేర్కొన్నారు.