చెన్నై : గర్భిణితో ఉన్న వైద్యురాలిని కరోనా మహమ్మారి బలి తీసుకున్నది. మరో ఇద్దరు నర్సులను కూడా కరోనా కాటేసింది. తమిళనాడుకు చెందిన షణ్ముఖప్రియ(32) అనే వైద్యురాలు కొవిడ్ రోగులకు గత కొంతకాలం నుంచి వైద్యం అందిస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భిణి. పది రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ షణ్ముఖప్రియ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచింది. ఆమె బిడ్డ ప్రాణాలను కూడా డాక్టర్లు కాపాడలేకపోయారు.
వేలూరులోని రాజీవ్ గాంధీ నగర్లో నర్సుగా సేవలందిస్తున్న ప్రేమ(52)కు కరోనా సోకింది. ఆమె వేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రేమకు ఏప్రిల్ 26న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇంద్ర(34) అనే నర్సు కూడా కరోనా మహమ్మారికి బలైంది. తమిళనాడులో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మే 24వ తేదీ వరకు లాక్డౌన్ విధించారు.