హైదరాబాద్ : మంత్రి మండలి విస్తరణతో ప్రధాని మోదీ ఈసారి రికార్డు బ్రేక్ చేస్తారా. ఇదే ఇప్పుడు చర్చనీయంశమైంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ.. తక్కువ సంఖ్యలో మంత్రులను రిక్రూట్ చేశారు. ఆ తర్వాత 2017లో తన టీమ్ సంఖ్యను పెంచారు. అయితే ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. రెండవసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి తన క్యాబినెట్ను ప్రధాని మోదీ విస్తరించనున్నారు.
2014లో తొలిసారి 45 మందితో మోదీ తన క్యాబినెట్ను ప్రకటించారు. మీనిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అన్న నినాదాన్ని ఇచ్చారాయన. కానీ మూడేళ్ల తర్వాత తన లీగ్ మెంబర్స్ను పెంచేశారు. మంత్రుల సంఖ్యను 76కు చేశారు ప్రధాని మోదీ. ఇక 2019లో రెండవసారి ఎన్నికైన తర్వాత.. తొలుత 58 మందితో క్యాబినెట్ను మోదీ ప్రకటించారు. అయితే వివిధ కారణాల చేత ఆ సంఖ్య ఇప్పుడు 53కు చేరుకున్నది. ఒకవేళ మోదీ కనుక 23 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో కొత్త మంత్రులను చేర్చుకుంటే, అప్పుడు ఆయన రికార్డు బద్దలు కొట్టడం అనివార్యం అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం కనీసం 22 మంది కొత్త మంత్రలు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అప్పుడు క్యాబినెట్ సామర్థ్యం 75కే చేరుకుంటుంది. ఇప్పటికే మంత్రి పదవి దక్కిన నేతలంతా మోదీ నివాసానికి చేరుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఆ జాబితా విడుదల కానున్నది. ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, ఒకరికి గవర్నర్ పదవి దక్కం వల్ల.. మోదీ రికార్డు నెలకొల్పాలంటే క్యాబినెట్లో ఎక్కువ సంఖ్యలో కొత్తవాళ్లను చేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ సంఖ్య 81 దాటరాదు. ఎందుకంటే లోక్సభ సభ్యుల్లో 15 శాతాన్ని మించరాదు.
2019లో మంత్రులుగా ప్రమాణం చేసిన హర్సిమ్రత్ కౌర్ బాదల్(అకాలీదళ్), అర్వింద్ సావంత్(శివసేన)లు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు. రామ్విలాస్ పాశ్వాన్ మృతితో ఆయన స్థానంలో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. సురేశ్ అంగడి కూడా కరోనాతో మృతిచెందారు. దీంతో మోదీ బృందంలో 53 మంది మంత్రులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. అంటే ఎక్కువలో ఎక్కువగా 28 మంది కొత్తవారిని క్యాబినెట్లో చేర్చుకునే అవకాశం ఉంది.