న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకున్నది. కానీ అది నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రైవేట్ రంగ సంస్థల్లో రూ.50 వేల లోపు వేతనం గల ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలన్నది హర్యానా చేసిన తాజా చట్టం. ఒకవేళ ఈ చట్టాన్ని అమలు చేయాల్సి వస్తే ప్రైవేట్ రంగ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది.
రెండేండ్ల క్రితం హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఇచ్చిన హామీయే ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పన. ఈ నిర్ణయం ప్రైవేట్ సంస్థలకు సమస్యగా పరిణమించనున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పారిశ్రామిక రంగ ప్రముఖులు, నిపుణులు షాక్కు గురయ్యారు. రాష్ట్రంలో 15 ఏండ్లుగా జీవిస్తున్న వారు స్థానికుల కిందకు వస్తారు. వారందరికీ ప్రైవేట్ సంస్థల్లో ఈ రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పారిశ్రామిక సంస్థలు పునరాలోచిస్తాయి. కొన్ని సంస్థలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
గుర్గావ్గా పేరొందిన గుర్గ్రామ్ నగరంపైనే అందరి ద్రుష్టి కేంద్రీక్రుతమైంది. గత రెండు దశాబ్దాల్లో గురుగ్రామ్ ఆటోమొబైల్ హబ్ అవతారమెత్తింది. భారతదేశంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు అతిపెద్ద మల్టీ నేషనల్ కంపెనీలకు వేదికగా మారింది.. తత్ఫలితంగా ఐటీ హబ్గానూ రూపాంతరం చెందింది. ఈ సంస్థల్లోనూ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ విన్నె మెహతా స్పందిస్తూ.. హర్యానా సర్కార్ నిర్ణయం నిరుత్సాహపరిచేదిగా, చాలా రిస్ట్రిక్టివ్గా ఉందన్నారు. గుర్గావ్ పరిధిలో ఆరు ప్రధాన కంపెనీలు (ఓఈఎంలు), 600 పై చిలుకు విడి భాగాల కంపెనీలు పని చేస్తున్నాయి. ఆటోమొబైల్ హబ్గా అవతరించిన హర్యానాలో ఇటువంటి ఆంక్షలు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై కంపెనీలు పునరాలోచించేలా చేస్తాయని విన్నె మెహతా వ్యాఖ్యానించారు.
టీమ్ లీజ్ సహ వ్యవస్థాపకులు రితుపర్ణ చక్రవర్తి స్పందిస్తూ దీనిపై స్పందించడానికి మాటలు రావడం లేదన్నారు. హర్యానా సర్కార్ తీసుకొచ్చిన చట్టం ఆర్థిక ఆత్మహత్య అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి పెద్దగా టైం తీసుకోబోవన్నారు. మంచి రాజకీయాలు చెడు ఆర్థిక విధానాలకు దారి తీస్తాయని వ్యాఖ్యానించారు. ఎక్కువ ఉద్యోగాలు అవసరమైన రాష్ట్రం మూల్యం చెల్లించక తప్పదన్నారు.
ఇదిలా ఉంటే, హర్యానా బాటలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు చట్టం చేసే దిశగా అడుగులేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పెరిగిపోతున్న నిరుద్యోగం ప్రభుత్వాలను వెంటాడుతున్నది.
ఉద్యోగాల కల్పన హామీ రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగడానికి పాపులిస్టు వేగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీ-మార్ట్ ప్రతినిధి లలిత్ అగర్వాల్ స్పందిస్తూ ఆంక్షలు అమలులోకి వస్తే పెట్టుబడుల విషయమై పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. ఈ చట్టం వ్యాపారులకు సాయం చేయబోదన్నారు.