సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి గృహాన్ని నందనవనంలా మార్చాలని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు సంకల్పించారు. హరితహారం ఏడో విడతలో భాగంగా కోటి మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ లక్ష్యంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో మొత్తం 600 నర్సరీలను ఏర్పాటు చేశారు. వార్డు ఆఫీసులు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈ నర్సరీల్లో 25 లక్షల చొప్పున మొక్కలు సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఒక్కొక్కరికీ ఆరు మొక్కలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. తులసీ, అశ్వగంధ, అల్లోవేరా, కలబంద, లెమన్గ్రాస్, లావెండర్, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, వేప, జాస్మిన్, మందారం మొక్కలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని.. కావాల్సిన వారు www.ghmc.gov.inలో సంప్రదించవచ్చన్నారు. అధికంగా మొక్కలు కావాలనుకునే వారు తమ వివరాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలని పేర్కొన్నారు.