ముంబై: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్నది. మహా సర్కార్లోని ఓ మంత్రి రెండోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈమధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. సీఎం ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలో ధనుంజయ్ ముండే సామాజిక న్యాయం, స్పెషల్ అసిస్టెన్స్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (ఎన్సీపీ) చెందిన ఆయన గతేడాది జూన్లో కరోనా బారినపడ్డారు. మరోసారి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన ట్విటర్ ద్వారా మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు.
‘నాకు ఈరోజు రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనను కలిసిన ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలి. తనగురించి భయపడాల్సింది ఏమీలేదు. ప్రతిఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి’ అని మరాఠీలో ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 28,699 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,33,026కు చేరాయి. ఇందులో 22,47,495 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకున్నారు.