అహ్మదాబాద్ : సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. అహ్మదాబాద్ నగరంలోని కంక్రియ, చందోలా సరస్సుల్లోని వాటర్ శాంపిల్స్ లో కూడా వైరస్ ఆనవాళ్లు గుర్తించారు. ఐఐటీ, గాంధీనగర్ పరిశోధకులు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ కు చెందిన పరిశోధకులు ఈ నమూనాలను సేకరించారు.
సరస్సులు, నదుల్లో కరోనా వైరస్ ఉనికి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ మనీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 2019 సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్ 29 మధ్య నీటి నమూనాలను తాము సేకరించామని, సబర్మతి నది నుంచి 694 నమూనాలను, చందోలా సరస్సు నుంచి 549, కంక్రియ సరస్సు నుంచి 402 నమూనాలను సేకరించామని కుమార్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి పరీక్షలు చేపట్టాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. సహజ నీటివనరుల్లో వైరస్ ఎక్కువకాలం ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక యూపీ, బిహార్ లోని గంగా నదిలో గతంలో కరోనా రోగుల మృతదేహాలు తేలినట్టు వార్తలు వచ్చాయి. దాదాపు 100కి పైగా మృతదేహాలు గంగా నదిలో కొట్టుకువచ్చినట్టు పలు కధనాలు వెల్లడయ్యాయి.