రాష్ట్రంలో హెచ్ఎస్ఐఎల్ 7వ పెట్టుబడి
ఒకే సంస్థ నుంచి మళ్లీ మళ్లీ పెట్టుబడులు
ప్రభుత్వ సానుకూల విధానాలకు నిదర్శనం
ట్విట్టర్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
భువనగిరిలో 230 కోట్లతో గాజు పరిశ్రమ ఏర్పాటు చేయనున్న హెచ్ఎస్ఐఎల్ గ్రూప్ ఎండీ సందీప్ సోమానీని సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్ఎస్ఐఎల్ గ్రూప్ భువనగిరిలో రూ.230 కోట్లతో గాజు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్లో వెల్లడించారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సందీప్ సోమానీ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హెచ్ఎస్ఎల్ గ్రూప్ రాష్ట్రంలో ఏడోసారి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నదని వివరించారు. ఆ యా సంస్థలు మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టడానికి రావడం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సానుకూలంగా ఉన్నాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అధికారులకు మంత్రి కేటీఆర్ కితాబు
‘గ్రేట్ జాబ్ రాజర్షీ షా (సంగారెడ్డి అదనపు కలెక్టర్), సంగారెడ్డి కలెక్టర్’.. జంతువుల సంరక్షణ కోసం తీసుకునే ఇలాంటి చర్యల వల్లే పరిపాలనలో మానవీయ కోణం బయటపడుతుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కితాబిచ్చారు. సంగారెడ్డిలో జంతువుల సంరక్షణ కోసం కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ట్విట్టర్లో తెలపగా.. దానిపై కేటీఆర్ స్పందించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షీ షాను, కలెక్టర్ను గ్రేట్ జాబ్ అంటూ మెచ్చుకున్నారు.