అక్షరాలు నేర్చుకునే వయసు కూడా లేదు.. అయినా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందో చిన్నారి. బుడిబుడి అడుగులు వేసే వయసులో అద్భుత జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, దమ్మాయిగూడకు చెందిన ఐశ్వర్య తన ప్రతిభతో అపర మేధావిగాకీర్తిపొందుతున్నది.
తడబడకుండా..
2018లో ముత్యం సుప్రియ, రాఘవేందర్ దంపతులకు ఐశ్వర్య జన్మించింది. అమ్మ, నాన్న, అత్త వంటి పదాలకే పరిమితమైన ఏడాదిన్నర వయసులో తల్లి శిక్షణతో రైమ్స్ను స్పష్టంగా చెప్పే స్థాయికి చేరుకున్నది. బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఐశ్వర్య ప్రతిభను చూసి ప్రశంసించే వారు. దీంతో సుప్రియ తన కూతురును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి, మరింత తర్ఫీదునిచ్చారు.
అద్భుత జ్ఞాపకశక్తితో..
తల్లి సుప్రియ శిక్షణతో చిన్నారి ఐశ్వర్య తన అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని కైవసం చేసుకుంది. తల్లిదండ్రులు తమ కూతురు ప్రతిభా పాటవాలను తెలియజేసేందుకు ఐశ్వర్య చెప్పిన ఆరు వాహనాలు, మూడు పక్షులు, పన్నెండు రంగులు, ఎనిమిది కూరగాయలు, ఆరు పండ్లు, 18 తినుబండారాలు, 44 వస్తువులు, 33 బొమ్మలు, 27 జంతువులు, ఐదుగురు దేవుళ్ల పేర్లు, ఇంగ్లిషు అక్షరాలు ఇలా వివిధ అంశాలను రికార్డు చేసి పంపగా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతిభను గుర్తించి.. ఐశ్వర్యకు పతకం, ప్రశంసాపత్రం అందించింది. బడికి వెళ్లకుండానే తల్లి శిక్షణలో ఐశ్వర్య ఈ ఘనతను సాధించిందని తండ్రి ముత్యం రాఘవేందర్ చెప్పారు. తన కూతురు ప్రతిభకు మరింత పదునుపెట్టి, భవిష్యత్లో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తామని చెప్పారు.