న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఐపీఎల్-14 సీజన్కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో గడపాలనే కారణంతో అశ్విన్ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే, పరిస్థితులు చక్కడిన తర్వాతే మళ్లీ మైదానంలోకి దిగుతానని తెలిపాడు. ఇక అశ్విన్ నిర్ణయంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పందించింది. కష్ట సమయంలో అతడికి పూర్తి అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించింది. అశ్విన్ కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రార్థిస్తోందని, త్వరలోనే అందరూ కోలుకుంటారని ఆకాంక్షించింది. అదే విధంగా.. అశ్విన్ జట్టుతో చేరాలని భావించినపుడు తప్పకుండా అతడు తిరిగిరావొచ్చని పేర్కొంది. సీజనల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటి వరకు అశ్విన్ ఐదు మ్యాచ్లు ఆడగా.. ఒక వికెట్ పడగొట్టి, ఏడు పరుగులు తీశాడు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇద్దరు క్రికెటర్లు సీజన్ నుంచి ఇంటిదారి పట్టారు. రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా ఆటగాడు అండ్రూ టైతో పాటు ఇంగ్లాండ్కు చెందిన మరో క్రికెట్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం టోర్నీ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థలో మార్పులు చేసిన కారణంగా అతను స్వదేశానికి వెళ్లాడు. బ్రిటన్ ప్రభుత్వం భారత్ను రెడ్లిస్ట్లో చేర్చడంతో లివింగ్స్టోన్ స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరో వైపు వేర్వేరు జట్లకు ఆడుతున్న మరో ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారని, ఆస్ట్రేలియా ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను కఠినతరం చేసినందున వెనుదిరగాలని భావిస్తున్నట్లు సమాచారం.