న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియనే లేదు.. అప్పుడే థర్డ్ వేవ్పై ఆందోళన మొదలైంది. థర్డ్ వేవ్ తప్పదు అన్నది చాలా మంది వాదన. అయితే అది ఎప్పుడు వస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పెద్దగా సమయం పట్టకపోవచ్చని ఒకరు, కనీసం ఆరు నుంచి 8 నెలలు పడుతుందని మరొకరు చెబుతున్నారు. అయితే తాజాగా ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా ఈ థర్డ్ వేవ్పై స్పందించారు. ఒకవేళ ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే వచ్చే 6 నుంచి 8 వారాల్లోనే థర్డ్ వేవ్ రావచ్చని ఆయన హెచ్చరించారు.
డెల్టా ప్లస్ వల్లే కరోనా థర్డ్ వేవ్ వస్తుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ వేరియంట్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి ఇండియాలో ఆ వేరియంట్ ప్రభావం ఎక్కువగా లేదు. డెల్టా ప్రభావమే మన దగ్గర ఎక్కువ. అందువల్ల దానిని ట్రాక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి అని గులేరియా అన్నారు. ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తోందో ఎప్పటికప్పుడు చూస్తూ అందుకు తగిన విధంగా సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు.
అయితే ఈ మూడో వేవ్ కోసం సిద్ధమవడంలో భాగంగా దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. మూడో వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్లాంటి ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో మనం ఏం చేయగలమో చూడాలి. మన ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించాలి అని గులేరియా అన్నారు. కాలానికి అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్యం అందరికీ సమానంగా అందే ప్రాథమిక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు.